ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ సంఘటనతో భద్రతా వ్యవస్థకు గణనీయమైన విజయంగా అధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉండటం విశేషం. ఆయనతో పాటు పలు స్థాయిలకు చెందిన మావోయిస్టులు లొంగుబాటు కావడంతో ఆ సంస్థకు గట్టి దెబ్బ తగిలిందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. మావోయిస్టులు లొంగిపోయేటప్పుడు సుమారు 40కి పైగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో తుపాకులు, ఇతర ఆయుధ సామగ్రి ఉన్నట్లు అధికారులు తెలిపారు.లొంగిపోయిన వారిలో ఎక్కువమంది ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టులే కావడం గమనార్హం. అక్కడ భద్రతా బలగాల కూంబింగ్ చర్యలు పెరగడంతో మావోయిస్టుల కదలికలు కష్టతరమయ్యాయి. దీంతో వారు తెలంగాణకు చేరుకుని లొంగుబాటు మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.లొంగుబాటు చేసిన వారిలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒక్కరే ఉండగా, మిగతావారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఇది రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం తగ్గుతున్న సంకేతంగా అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, లొంగుబాటు చేసిన వారికి ప్రభుత్వం తరఫున పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన ప్రవాహంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ పరిణామం తెలంగాణలో శాంతి భద్రతలకు మరింత బలాన్నిచ్చే దిశగా కీలకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
