జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను జూన్ తొలి వారంలోనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ఇప్పటివరకు 64 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇందుకోసం 9.31 లక్షల మంది రైతులకు రూ.11,500 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అలాంటి ధాన్యానికీ కనీస మద్దతు ధర చెల్లిస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
