హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ తయారు చేయబడింది. ఈ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు లేదా ప్రాంతాలు అనే వ్యత్యాసం లేకుండా అర్హతగల ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ పూర్తయ్యే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని యాప్లో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంచి జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.
