ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: చలో సెక్రటేరియట్కు బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. విషయం తెలిసిన వెంటనే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్కడికి చేరుకుని ఉద్యమకారులకు మద్దతుగా నిలిచారు.పోలీస్ స్టేషన్ వద్దే కూర్చుని, ఉద్యమకారులను విడుదల చేసే వరకు వెళ్లబోనని కవిత తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమంలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు భూములు, పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయకపోవడం అన్యాయమని కవిత విమర్శించారు. ఈ హామీల కోసం పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే భూపోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉద్యమకారుల హక్కుల కోసం తాము ఎప్పటికీ వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు.కవిత జోక్యంతో చివరికి పోలీసులపై ఒత్తిడి పెరిగి, నిర్బంధంలో ఉన్న ఉద్యమకారులను విడుదల చేసినట్లు సమాచారం.
