ఏపీలో అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల
అమరావతి:
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం మరియు తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.
బుధవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “అంగన్వాడీ పిల్లలు సాధించిన పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ప్రతి నెల 5వ తేదీ ఈసీసీఈ దినోత్సవం నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.
ఇక ప్రత్యేక డ్రైవ్ల ద్వారా 371 మంది పిల్లల్ని కార్మిక వృత్తి నుంచి విముక్తి కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల పెంపుదలతో పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు మరింత మెరుగవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అంగన్వాడీల అభివృద్ధిపై దృష్టి
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అందులో భాగంగా మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను కల్పించేందుకు కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అంగన్వాడీ పిల్లల ఆరోగ్య భద్రతకు తోడ్పాటు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
