నారాయణపేట, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఆర్డీఓ ఏసీబీకి చిక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం స్వీకరిస్తూ అధికారుల చేతికి చిక్కారు.ఊట్కూర్ మండలానికి చెందిన వ్యక్తి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని జారీ చేయడానికి డబ్బు ఇవ్వాలని ఆర్డీఓ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళిక రూపొందించారు.ఆ ప్రణాళిక ప్రకారం బాధితుడు కార్యాలయంలోనే లంచం ఇవ్వగా, వెంటనే దాడి చేసిన ఏసీబీ అధికారులు ఆర్డీఓను పట్టుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, ఆర్డీఓ నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
