ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై పార్టీ నేతలు నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఎమ్మెల్సీ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని నాగబాబు తెలిపారు. మరో వారం రోజుల్లో ఆయన తిరిగి విధుల్లోకి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.అయితే సమావేశంలో పలువురు నేతలు పవన్ ఆరోగ్యంపై ప్రశ్నించకుండా స్థానిక రాజకీయ అంశాలు, డిమాండ్లపై చర్చ మొదలుపెట్టడం నాగబాబును అసహనానికి గురిచేసింది. ఫైవ్ మెన్ కమిటీ, కాపు కార్పొరేషన్ వంటి విషయాలు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు.“పార్టీ అధినేత ఆరోగ్యం గురించి అడగకుండా ఇతర విషయాలపై మాట్లాడటం సరైంది కాదు” అని నాగబాబు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. నాయకత్వంపై గౌరవం చూపాలని ఆయన సూచించారు.ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన గైర్హాజరీలో పార్టీ కార్యకలాపాల సమన్వయం సవాలుగా మారిన నేపథ్యంలో, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడటం కీలకంగా భావిస్తున్నారు.
