ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్లో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన వి.కోట పట్టణంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.ప్రతి రోజులాగే మార్నింగ్ వాక్కు వెళ్లిన జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో వి.కోటకు చెందిన రౌడీషీటర్ తమీమ్ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు సమాచారం. వ్యక్తిగత వైరం కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ప్రస్తుతం నిందితుడు కర్ణాటకలో తలదాచుకున్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జర్నలిస్ట్ హత్యపై మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
