ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ఉద్ధృతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటుగా విరుచుకుపడ్డారు.ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “దానవీరశూరకర్ణ”లా కనిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత “కుంభకర్ణుడు”లా మారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలనలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు.కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడం పార్టీకి బలం చేకూరుస్తుందని అన్నారు.ఎన్నికల సమయంలో తనను “పాలమూరు బిడ్డ”గా చెప్పుకున్న రేవంత్, ఇప్పుడు ఆ ప్రాంత సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాగర్ కర్నూలు, పాలమూరు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, విద్యుత్ సరఫరా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.రైతు బంధు పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని, రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం లేదని ఆరోపించారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు.
