Breaking News

పోలీస్ శాఖలో భారీ నియామకాలు.. 19 వేల పోస్టుల భర్తీకి సిద్ధం

మే 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని దశలవారీగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.ఇప్పటికే తొలి విడతగా 5,000 పోస్టుల నియామకాలకు ఆమోదం లభించినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నియామక ప్రక్రియను వేగవంతం చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.పోలీస్ వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు కీలక మార్పులు కూడా చేపడుతున్నట్లు డీజీపీ తెలిపారు. గతంలో మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ విభాగాలకు మళ్లించనున్నట్లు చెప్పారు.ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ, ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని, నేరాల నియంత్రణలో కఠిన చర్యలు కొనసాగుతాయని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

ఉత్తర–దక్షిణ రాజకీయాలకు ప్రజల చెక్: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్.. గోరక్షకులకు పోలీసుల కఠిన హెచ్చరికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *