మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది. విద్యార్థుల వివరాల ధృవీకరణను మరింత కట్టుదిట్టం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై పదో తరగతి మెమోలో ఉన్న పేరు, ఇంటిపేరు ఆధార్ కార్డులోని వివరాలతో పూర్తిగా సరిపోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నకిలీ దరఖాస్తులను అరికట్టడం, అర్హులైన విద్యార్థులకే ప్రయోజనాలు చేరేలా చూడడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఇప్పటివరకు విద్యార్థుల పేర్లలో స్పెల్లింగ్ పొరపాట్లు, ఆధార్-సర్టిఫికెట్ల మధ్య వ్యత్యాసాల వల్ల దరఖాస్తుల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యేవి. కొందరు తప్పుడు వివరాలతో దరఖాస్తులు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ధృవీకరణ విధానాన్ని తీసుకొచ్చింది.కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు ముందుగా పదో తరగతి హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఉత్తీర్ణులైన సంవత్సరం వంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. అనంతరం ఆ వివరాలను ఆధార్ డేటాబేస్తో సిస్టమ్ సరిపోల్చుతుంది. రెండు వివరాలు పూర్తిగా ఒకేలా ఉన్నప్పుడే తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంటుంది.పేరులో చిన్నపాటి అక్షర తేడా, ఇంటిపేరు మార్పు, స్పెల్లింగ్ పొరపాటు ఉన్నా అప్లికేషన్ నిలిచిపోతుంది. దీంతో విద్యార్థులు ముందుగానే తమ ఆధార్, విద్యాసర్టిఫికెట్లలోని వివరాలను సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.మొదటి దశ పూర్తైన తర్వాత విద్యార్థికి ప్రత్యేక ఐడీ నంబర్ జారీ అవుతుంది. అనంతరం మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. వేలిముద్రలు లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా గుర్తింపు నిర్ధారణ అయిన తర్వాతే తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది.తర్వాత విద్యార్థులు విద్యా, బ్యాంకు, ఆదాయ ధృవీకరణకు సంబంధించిన మిగతా వివరాలను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నిబంధనలు కొత్త దరఖాస్తుదారులతో పాటు ఇప్పటికే స్కాలర్షిప్ పొందుతున్న రెన్యువల్ విద్యార్థులకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు చిన్నపాటి సర్టిఫికెట్ పొరపాట్ల కారణంగా ఇబ్బందులు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు సవరణల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావచ్చని అంటున్నారు.తెలంగాణలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఈ పథకాలు కీలక ఆధారంగా నిలుస్తున్నాయి.
