మే 11, (నేటి తెలుగు పత్రిక): వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మృతుడి ఆస్తిపై హక్కు ఉండదని స్పష్టం చేసింది. మృతుడు తన వీలునామాలో నిందితుడి పేరును చేర్చినా కూడా ఆస్తి పొందే అర్హత ఉండదని ధర్మాసనం తేల్చి చెప్పింది.జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 25 ప్రకారం హత్య చేసిన వ్యక్తి లేదా హత్యకు సహకరించిన వ్యక్తి మృతుడి ఆస్తిని పొందే హక్కును కోల్పోతాడని కోర్టు గుర్తుచేసింది.“తప్పు చేసి దాని ద్వారా లాభం పొందడానికి ఎవరినీ అనుమతించకూడదు” అనే న్యాయ సూత్రాన్ని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుకు తప్పనిసరిగా క్రిమినల్ కోర్టులో శిక్ష పడాల్సిన అవసరం లేదని కూడా కోర్టు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఆస్తి కోసం జరిగే నేరాలు, కుటుంబ వివాదాల కేసుల్లో ఈ తీర్పు భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలిచే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ ఆస్తుల విషయంలో నైతికత, చట్టబద్ధతకు ఈ తీర్పు మరింత బలం చేకూర్చిందని పేర్కొంటున్నారు.
