మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై కీలక చర్చలు జరిపారు.అమిత్ షాతో భేటీలో రాష్ట్ర విభజన హామీలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు.కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు. 2027 గోదావరి పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేయడానికి కేంద్ర సహకారం అవసరమని తెలిపారు. తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటి నిల్వకు అవసరమైన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు.కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగంగా సాగుతున్నాయని సీఎం వివరించారు. 2011లో జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు.కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం కుడి కాలువ పనులు 95 శాతం, ఎడమ కాలువ పనులు 78 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. కాలువల విస్తరణకు సంబంధించిన ఖర్చులను రీఎంబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ప్రధాన మంత్రి కృషి సీంచాయి యోజన కింద చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
