సచివాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష
అమరావతి: రాష్ట్రానికి పెండింగ్ నిధులపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సోమవారం ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులు, పోలీసు స్టేషన్లు, జైళ్ల అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష జరిగింది.
కేంద్ర పథకాల నిధులపై చర్చ
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖకు సంబంధించిన పెండింగ్ నిధులు రాబట్టడం, పోలీసు శాఖకు అవసరమైన టెక్నాలజీ, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు జరిగాయి. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమం వంటి విభాగాలకు రావాల్సిన నిధులపై కూడా చర్చించారు.
రాష్ట్రానికి కావాల్సిన కేంద్ర సంస్థలు
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రేహౌండ్స్, అప్పా వంటి కీలక కేంద్ర సంస్థలను ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఏపీకి 118 కేంద్ర సంస్థలు రావాల్సి ఉన్నాయని, వాటిని తీసుకురావడంలో కేంద్రానికి దృష్టి సారించాల్సి ఉందని కోరారు.
హోం మంత్రి అమిత్ షాను కలవనున్న హోంమంత్రి అనిత
రాష్ట్రంలోని పెండింగ్ నిధులు, కేంద్ర పథకాల అమలుపై త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను హోం మంత్రి అనిత, రాష్ట్ర పోలీసు అధికారులు కలవనున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని, రాష్ర్టానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులను సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అధికారుల సమక్షంలో సమీక్ష
ఈ సమీక్షకు హాజరైన వారిలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఐజీ విజయకుమార్, ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబీ గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడైర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సమావేశం అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. టెక్నాలజీ ఆధారంగా పోలీసు శిక్షణ, సౌకర్యాలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
