విశాఖలో ప్రధాని సభా ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమీక్ష
విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా జరుగుతున్న సభా ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్రం త్వరలో భారీ ప్యాకేజీ ప్రకటించనున్నట్టు తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల సమస్యలను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ కింద రూ.17 వేల కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని పురందేశ్వరి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకారం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం విస్తృత సహకారం అందిస్తోందని పురందేశ్వరి అన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరంకు రూ.12,500 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.4,800 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.6,000 కోట్లు నిధులు అందజేసినట్లు వివరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీపై దాడులపై స్పందన
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా ప్రవర్తించిందని పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ నేతలపై దాడులను ఖండిస్తున్నామని, చట్టపరంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్
బుధవారం విశాఖకు రానున్న ప్రధాని మోడీ ఎన్టీపీసీ ప్రాజెక్టు, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి పలు కీలక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా పూర్తి అయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఈ పర్యటనకు ఏపీ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా విశాఖ పర్యటనలో పాల్గొంటున్నారు. రోడ్ షో నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
