తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి: వెంకయ్య నాయుడు
రాజానగరం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని కార్యాలు తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు కూడా మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ)లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించారు.
అమ్మ భాషను మరిచే వారు అమ్మను మరిచినట్లేనని ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రం బయట ఉన్న వారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవాళ్లు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు తెలుగు మాట్లాడడం మానేసినట్లు కనిపిస్తున్నారు’’ అని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
మాతృభాష వాడకం న్యాయస్థానాల్లో పెరగాలని, సినిమాల్లో, పాటల్లో తెలుగుదనం ఉండాలని ఆయన అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్, నార్ల వెంకటేశ్వరరావు, రామోజీరావు వంటి వ్యక్తులు ఎంతో కృషి చేశారని, ‘‘మన భాషను మనమే కాపాడుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
