కరీంనగర్లో బీఆర్ఎస్కు భారీ షాక్: మేయర్ సునీల్ రావు రాజీనామా
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) కంచుకోటగా భావించిన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో గులాబీ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు (Sunil Rao) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు బీజేపీ (BJP)లో చేరబోతున్నారు.
పార్టీకి గుడ్బై చెప్పిన సునీల్ రావు
కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు, బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “పార్టీలో పెరిగిపోయిన అవినీతి కారణంగానే నేను పార్టీని వీడుతున్నాను,” అంటూ వ్యాఖ్యానించారు. రివర్ ఫ్రంట్ (River Front), స్మార్ట్ సిటీ (Smart City) ప్రాజెక్టులలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు.
“అవినీతి నేత పేరును బయట పెడతా!”
మేయర్ సునీల్ రావు తన వ్యాఖ్యల్లో, “బీఆర్ఎస్ నేతలు ఎలా అవినీతికి పాల్పడుతున్నారో నాకు తెలిసింది. ప్రతి అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. సరైన సమయం వస్తే ఆ గుట్టు విప్పుతాను,” అంటూ హెచ్చరించారు. త్వరలోనే ఓ అవినీతి నేత పేరును బయటపెడతానని చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.
బీజేపీలో చేరికకు సన్నాహాలు
బీజేపీ నేత బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ సునీల్ రావు బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ చేరిక కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
