శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన – టేకాఫ్ ఆలస్యం చేసిన స్పైస్ జెట్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శుక్రవారం (ఫిబ్రవరి 7) ఉదయం 9 గంటలకు ప్రయాగరాజ్కు బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం మధ్యాహ్నం 2 గంటల వరకు టేకాఫ్ కాకపోవడంతో, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
సాంకేతిక సమస్యల కారణంగా టేకాఫ్ ఆలస్యం
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే టేకాఫ్ ఆలస్యమైందని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. అయితే, అధికారుల నుంచి సరైన సమాచారం అందకుండా ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హీరో విజయ్ దేవరకొండ సహా పలువురు ప్రముఖులు వేచి ఉండే పరిస్థితి
ఈ విమానంలో ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు సినీ ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్నట్లు సమాచారం. విమాన ఎప్పుడెళుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
“రూ.30 వేలు పెట్టి టికెట్ కొన్నా ఇబ్బందులు” – ప్రయాణికుల ఆగ్రహం
“మంచి డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు?” అంటూ ప్రయాణికులు స్పైస్ జెట్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ నిర్లక్ష్యంపై ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఆందోళనకు దిగారు.
కుంభమేళా కోసం ప్రయాగరాజ్కు బయలుదేరిన వందలాది మంది
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి చాలా మంది పవిత్ర స్నానం కోసం అక్కడికి బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు పెరిగాయి.
