కష్టానికి ప్రత్యామ్నయం లేదు
జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కష్టపడాల్సిందే
జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించిన మంత్రి లోకేష్
అమరావతి: జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. JEE (Mains) – 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను మంత్రి లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచావు, మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏ అవసరం ఉన్న ఒక్క మెసేజ్ పెట్టు అన్నగా అండగాఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో నాకు తెలుసు అంటూ ఆమె తల్లిని కూడా లోకేష్ సత్కరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు. ఇండస్ట్రీకి అవసరమైన కరికులం ఉండాలనేది నా ఆలోచన, జాబ్ రెడీ యూత్ ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను ప్రోత్సహించలనేది నా ధ్యేయమని అన్నారు. కేజీ టు పీజీ విద్యలో చేస్తున్న మార్పుల గురించి వివరించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివి సాధించలేని ఉద్యోగం… నాలుగు నెలలు అమీర్ పేట లో కోర్స్ చేసి ఎలా సాధిస్తున్నారనేది నా ప్రశ్న. విద్యార్థి కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా తయారు కావాలన్నది తన ఆకాంక్షగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.



