పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన
న్యూ ఢిల్లీ:
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. గత కొన్నిరోజులుగా పార్లమెంటు లోపల, బయట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం కూడా విపక్ష ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ చిత్రాలతో పాటు “మోదీ-అదానీ భాయ్ భాయ్” నినాదాలు ముద్రించిన బ్యాగులను పట్టుకొని పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రియాంక చేతిలోని బ్యాగ్ను పరిశీలించండి, ఎంత ప్రత్యేకంగా ఉందో! బ్యాగ్పై ఒకవైపు మోదీ, మరోవైపు అదానీ బొమ్మలతో పాటు ‘మోదీ అదానీ భాయ్ భాయ్’ అని రాసి ఉంది” అన్నారు.
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, “మేం సభా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదు. ఏదో ఒక సాకుతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తోంది,” అంటూ విమర్శించారు.
విపక్షాల నిరసనలు మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ వివాదం పరిష్కారానికి ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో చూడాలి.
