నేటి తెలుగు పత్రిక: వ్యవసాయం ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. రైతులకు అవసరమైన సమాచారం తక్షణమే అందేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పలు డిజిటల్ సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పంటల నిర్వహణ నుంచి వాతావరణ హెచ్చరికల వరకు సమగ్ర సమాచారం ఇప్పుడు మొబైల్లోనే అందుతోంది.
కిసాన్ ఇ-మిత్ర తో ప్రభుత్వ పథకాల సమాచారం
రైతుల సందేహాలను తీర్చేందుకు కేంద్రం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ ఇ-మిత్ర అనే ఏఐ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చింది.
ఇది రైతులకు:
- ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
- కిసాన్ క్రెడిట్ కార్డ్
- ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
వంటి పథకాల వివరాలు అందిస్తుంది. తెలుగు సహా 11 భాషల్లో సేవలందించడం దీని ప్రత్యేకత.
పంటలకు వ్యాధులు?.. ఇక చింత లేదు
పంటలకు తెగులు సోకితే ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి తగ్గింది. జాతీయ తెగులు నిఘా వ్యవస్థ యాప్ ద్వారా పంట ఫోటో అప్లోడ్ చేస్తే, ఏఐ ఆధారంగా వ్యాధిని గుర్తించి తగిన మందులు, నివారణ చర్యలను సూచిస్తుంది.
ముందస్తు వాతావరణ హెచ్చరికలు
రుతుపవనాల గమనాన్ని విశ్లేషించి వర్ష సూచనలు ముందుగానే రైతుల మొబైల్కు SMS రూపంలో అందిస్తున్నారు. దీంతో:
- విత్తనాల విత్తడం
- ఎరువుల వేయడం
- నీటి నిర్వహణ
వంటి నిర్ణయాలు సులభమవుతున్నాయి.
బీమా క్లెయిమ్ స్టేటస్ కూడా సులభమే
ఫసల్ బీమా క్లెయిమ్ల స్థితి, పథకాల అర్హత వివరాలు వంటి సమాచారాన్ని చాట్ సేవల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ రైతుకు అవగాహన పెరుగుతోంది. సాగులో రిస్క్ తగ్గి, లాభదాయకత పెరగే దిశగా అన్నదాత అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ అండతో రైతు జీవితంలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి.
