Mar 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా తరగతి గదుల్లో బోధన విధానంలో సాంకేతిక మార్పులు తీసుకొస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో “క్లిక్కర్” ఆధారిత డిజిటల్ బోధన విధానాన్ని ప్రవేశపెట్టింది.ఈ కార్యక్రమాన్ని ఎన్.చంద్రబాబు నాయుడు గత ఏడాది డిసెంబర్ 5న నిర్వహించిన మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్లో ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52 ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలవుతోంది.క్లిక్కర్ వ్యవస్థ ద్వారా ప్రతి విద్యార్థి చేతిలో చిన్న రిమోట్ ఉండగా, ఉపాధ్యాయులు బోధించిన పాఠం ఎంతవరకు అర్థమైందో రియల్ టైంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు విద్యార్థులు వెంటనే సమాధానాలు ఇవ్వగలరు. అలాగే సందేహాలు ఉంటే “హ్యాండ్ రైజ్” ఆప్షన్ ద్వారా ఉపాధ్యాయులకు తెలియజేయవచ్చు.
తిరుపతి లోని ఎస్పీజేఎన్ఎం మున్సిపల్ స్కూల్, చిత్తూరు లోని పీఎన్సీ మున్సిపల్ స్కూల్, తవణంపల్లి జడ్పీ హైస్కూల్లలో ఈ క్లిక్కర్ ప్రోగ్రాం అమలవుతోంది. సమ్మరీ వీడియోలు, క్విజ్ల ద్వారా విద్యార్థులు తరగతిలో చురుకుగా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.విద్యార్థులు ఇచ్చే సమాధానాల ఆధారంగా ఎవరికీ పాఠం అర్థమైందో, ఎవరికీ అర్థం కాలేదో ఉపాధ్యాయులు వెంటనే గుర్తించగలుగుతున్నారు. దీంతో అవసరమైన చోట పాఠాన్ని మళ్లీ వివరించే అవకాశం లభిస్తోంది. క్లిక్కర్ విధానం వల్ల విద్యార్థుల్లో పోటీ భావన పెరగడంతో పాటు హాజరు శాతం కూడా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం ప్రతి జిల్లాలో రెండు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ ప్రోగ్రాంను వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
