మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ కీలక చమురు కేంద్రంగా ఉన్న ఖార్గ్ దీవిపై దాడి కుట్ర జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేసింది.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖిర్ ఘాలిబాఫ్ ప్రకారం, ఒక ప్రాంతీయ దేశం సహకారంతో శత్రు దేశాలు ఈ దీవిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా సమాచారం అందిందని తెలిపారు. ఒకవేళ అలాంటి చర్యలు జరిగితే, ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అరబ్ దేశాలు కూడా ఈ ఘర్షణలోకి దిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా పలు గల్ఫ్ దేశాలు అప్రమత్తంగా మారాయి. ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి దేశాలు ఇరాన్ చర్యలను ఖండిస్తూ సంయుక్త ప్రకటనలు జారీ చేశాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఇంధన సరఫరాపైనా దీని ప్రభావం పడే అవకాశముంది.
