విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: విజయవాడ బార్ అసోసియేషన్ నాయకులు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని)ని గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ నేతృత్వంలో విజయవాడ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు వి లక్ష్మీనారాయణ, వీ కిరణ్ కుమార్, గవర్నింగ్ బాడీ సభ్యులు పలువురు ఎంపీ ని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ఇటీవల జరిగిన ఎన్నికలలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు గా అత్యధిక మెజారిటీతో గెలిచిన చలసాని అజయ్ కుమార్ తో పాటుగా విజయవాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. విజయవాడ బార్ అసోసియేషన్ తరపున ఎంపీ కేశినేని చిన్ని ను అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. విజయవాడ బార్ అసోసియేషన్ సమస్యలను ఎంపీ కేశినేని చిన్నికి అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు వివరించారు. బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే ఎంపీ ఫండ్స్ నుంచి నిధులను విడుదల చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. న్యాయవాదులు తెలిపిన కొన్ని సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ఆయా సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యెర్నేని వేదవ్యాస్, పిళ్ళ శ్రీనివాసరావు, బి. లెనిన్, ముష్టి శ్రీకాంత్, జి రమా తేజ, కె . ఇందిరా, ఇ. ఉషాజ్యోతి, వి. పద్మజ, చాట్ల రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

