మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీమ్ బాషా గారు పరిధిలో గల ప్రతిపాదన లో ఉన్న 7 చెరువులు (కాజా, చిన కాకాని, నూతక్కి, ఆత్మకూరు, పెనుమాక, నవులూరు, నిడమర్రు)పై సమగ్ర పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చెరువుల ప్రస్తుత పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.పరిశీలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ విభాగం అధికారులు మరియు ఇంజినీరింగ్ సిబ్బందితో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు చెరువుల పునరుద్ధరణ, బండ్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, పర్యావరణ పరిరక్షణ చర్యలు మరియు అందాల వృద్ధి (బ్యూటిఫికేషన్) కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేకంగా అమృత్ పథకం (AMRUT Scheme) కింద ఈ చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. చెరువుల పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం, వాకింగ్ ట్రాక్లు, హరిత వాతావరణం ఏర్పరచడం, ప్రజలకు విశ్రాంతి స్థలాలుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం ద్వారా నగర పాలక సంస్థ పరిధిలోని చెరువులను పునరుద్ధరించి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఉందని కమిషనర్ తెలిపారు.ఈ పరిశీలనలో అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

