ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్య ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేశారు. బోనకల్లు మండలంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేస్తూ మాట్లాడారు.“అక్షరం మనిషిని నిలబెట్టే శక్తి. చదువు ద్వారానే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరగలరు” అని ఆయన అన్నారు. సమాజంలో అసమానతలు తగ్గాలంటే విద్యాభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకలితో చదువుకోలేని పరిస్థితి రాకుండా అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఉచిత భోజన సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. విద్యా రంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయించి ఆధునిక వసతులు అందించనున్నట్లు వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రీడా సౌకర్యాలు, డిజిటల్ బోధన అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. విద్యార్థుల్లో ఉత్సాహం పెంచేందుకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు.
