ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: కడప జిల్లాలో ఓ వివాహం అనూహ్యంగా నిలిచిపోయింది. ముహూర్తానికి కొన్ని గంటల ముందే వరుడు కుటుంబం మండపం విడిచి వెళ్లిపోవడంతో పెళ్లి రద్దైంది.పుల్లంపేట మండలానికి చెందిన యువకుడు, కడపకు చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉండగా, అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. అయితే పెళ్లి రోజు వరుడు కుటుంబం తమకు కల్పించిన వసతులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వధువు కుటుంబంతో వాగ్వాదానికి దిగింది.చిన్నగా మొదలైన ఈ వివాదం పెద్ద గొడవగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు వరుడు కుటుంబం మండపం నుంచి వెళ్లిపోవడంతో పెళ్లి ఆగిపోయింది.ఈ ఘటనతో వధువు కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ఖర్చులు వృథా కావడంతో పాటు, కుటుంబ గౌరవానికి కూడా దెబ్బతగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న సమస్యల వల్ల జీవితాంతం గుర్తుండే బంధాలు దెబ్బతినడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
