ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా వ్యవస్థలు సులభంగా ఉండాల్సింది పోయి మరింత క్లిష్టంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశానికి ముందు అజెండా మంత్రులకు అందకపోవడంపై చర్చ జరిగింది. ముందుగానే అజెండా ఇచ్చి ఉంటే అంశాలను అధ్యయనం చేసి సమావేశానికి హాజరయ్యే వీలు ఉండేదని మంత్రులు సూచించారు. ఈ విషయంపై స్పందించిన సీఎం, కార్యదర్శుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.గతంలో అధికారులు చర్చల్లో చురుకుగా పాల్గొని సమస్యలను వెంటనే పరిష్కరించేవారని, ఇప్పుడు ఆ విధానం కనిపించడం లేదని పేర్కొన్నారు. పరిపాలనలో సమన్వయం లోపిస్తోందని సూచించారు. విద్యా రంగ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీలను పెంచాలని సీఎం ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో కొత్త విద్యాసంస్థలను ప్రోత్సహించాలని చెప్పారు.అలాగే ప్రభుత్వ పథకాల అమలులో మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా పాలన ఉండాలని ఆయన పేర్కొన్నారు.
