హైదరాబాద్, ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర పాలనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ వ్యవహారాలు పూర్తిగా అవ్యవస్థకు గురయ్యాయని, నగరంలో అభివృద్ధి కంటే అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.జీహెచ్ఎంసీ పరిధిలోకి చేరిన గ్రామాలకు సరైన సౌకర్యాలు అందడం లేదని ఆమె అన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో భారీ స్థాయిలో ప్రభుత్వ భూములను విక్రయించినప్పటికీ ఆ నిధులు నగరాభివృద్ధికి వినియోగించలేదని విమర్శించారు.నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని కవిత పేర్కొన్నారు. టెండర్ విధానం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని పక్కనపెట్టి అవినీతికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.కార్మికుల సమస్యలను కూడా ఆమె ప్రస్తావిస్తూ, నర్సరీ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ అంశంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కూడా కవిత విమర్శలు చేశారు. ప్రణాళికాబద్ధ అభివృద్ధి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపించారుమహిళా, బీసీ రిజర్వేషన్ల అమలుపై తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. మొత్తం మీద జీహెచ్ఎంసీ పాలనపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
