ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సింగర్ మంగ్లీపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వెలువడ్డాయి.బాధితుల ప్రకారం, మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ మరియు మరికొందరు కలిసి సుమారు 100 మందిని మోసం చేసి దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయం కోరుతూ బాధితులు లాయర్ సుబ్బారావును సంప్రదించారు. అయితే ఈ కేసులో ముందుకు సాగుతున్న క్రమంలో న్యాయవాదిని మంగ్లీ బృందం బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో లాయర్ సుబ్బారావు స్వయంగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడి ఒప్పందాలు, కాల్ డేటా రికార్డులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.
