ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షలు ఈ నెల 16తో ముగియనున్నాయి. పరీక్షలు పూర్తవగానే వెంటనే మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసి, ఈ నెల 23లోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే కొన్ని సబ్జెక్ట్లకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభమై, మార్కుల లెక్కింపు కొనసాగుతోంది. మిగతా పేపర్లను కూడా త్వరగా పూర్తి చేసి, ఫలితాల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.అన్ని ప్రక్రియలు సమయానికి పూర్తయితే, మే మొదటి వారంలోనే పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశముందని సమాచారం.గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాలు కొంత ఆలస్యంగా రానున్నాయి. ఎందుకంటే ఈసారి పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతున్నాయి. దీంతో మూల్యాంకనానికి సమయం పెరగడంతో ఫలితాల విడుదల కూడా కొంత ఆలస్యమవుతోంది.
