ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: వేసవి సెలవుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందుబాటులో లేకపోవడంతో, ‘డ్రై రేషన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం కింద అధికారులు నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరఫరా చేయనున్నారు. అయితే ఈ సదుపాయం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా, కేవలం కరువు ప్రభావిత 51 మండలాల్లోనే అమలు చేస్తున్నారు.ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ఈ మండలాల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.ప్రతి విద్యార్థికి ప్రత్యేక కిట్ అందించనున్నారు. ఇందులో 35 గుడ్లు, 21 చిక్కీలు, అలాగే 1-5 తరగతుల వారికి 5 కిలోల బియ్యం, 6-9 తరగతుల వారికి 6 కిలోల బియ్యం ఇవ్వనున్నారు.విద్యార్థులు లేదా తల్లిదండ్రుల ఆధార్ ధృవీకరణతో రేషన్ పంపిణీ జరుగుతుంది. పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.ఈ పథకం ద్వారా వేసవిలో కూడా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
