ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-2, ఫేజ్-3 అమలు విధానాలు, పరిశ్రమల అనుమతుల ప్రక్రియ సులభతరం చేయడంపై విస్తృతంగా చర్చించారు.సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచేందుకు అనవసర నిబంధనలను తగ్గించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 800కు పైగా నిబంధనలను 100లోపుకు తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని సూచించారు.పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాల్లో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వేధింపులు లేకుండా పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.అటవీ చట్టాలను అవసరమైన మేరకు సరళీకరించాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనల్లో నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర స్థాయి మార్గదర్శకాలు తీసుకురావాలని సీఎం అభిప్రాయపడ్డారు.
డబుల్ లైసెన్సింగ్ విధానాన్ని తొలగించి, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అయ్యే విధానం తీసుకురావాలని సూచించారు.దరఖాస్తు నుంచి అనుమతి వరకు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఫేజ్-2 అమలుతో పరిశ్రమల అనుమతుల్లో కనీసం 40 శాతం సమయం తగ్గేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఫేజ్-3పై కూడా త్వరలోనే పని ప్రారంభించనున్నట్లు కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఫేజ్-3లో టెక్నాలజీ అనుసంధానం, ఏఐ టూల్స్ వినియోగానికి పెద్దపీట వేయాలని సూచించారు. డేటా లేక్, రియల్ టైమ్ డేటా వ్యవస్థలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి డిజిటల్ విధానాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.ప్రభుత్వ పాలనను “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నుంచి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” వైపు తీసుకెళ్తున్నామని సీఎం తెలిపారు. సేవలందించడంలో వేగం పెంచేలా “స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్” అమలు చేస్తున్నామని వివరించారు.ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధి, పరిపాలనా సరళీకరణ, డిజిటల్ గవర్నెన్స్పై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
