ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏ రాజకీయ పార్టీకీ కూడా పొత్తు పెట్టుకోదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖానాపూర్లో బీఆర్ఎస్తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల స్థాయిలో జరిగిన వ్యవహారమని, అది పార్టీ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన వివరించారు. కాంగ్రెస్ నాయకులు, పోలీస్ బలాన్ని ఉపయోగించి గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇచ్చారని రాంచందర్ రావు అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రజల తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి చూపిన విశ్వాసం పార్టీ బలాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికార బలాన్ని ఉపయోగించినా ప్రజల నిర్ణయాన్ని మార్చలేరని విమర్శించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలకే అసెంబ్లీ సీట్లు పెంచాలని సీఎం చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పేద, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునేలా ఉన్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో మహిళల హక్కుల కోసం పెద్దగా చర్యలు తీసుకోలేదని రాంచందర్ రావు విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై మరోసారి చర్చలు వేడెక్కాయి.
