ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కార్మికులు తొందరపడకుండా సమ్మె నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చల ద్వారా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆ కమిటీ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మిగతా సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రి తెలిపారు. అన్ని అంశాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, సమ్మె వంటి నిర్ణయాలకు ముందుగా అన్ని కోణాల్లో ఆలోచించాలని ఆయన సూచించారు.ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల జేఏసీ సమ్మె దిశగా ముందుకు సాగుతోంది. లేబర్ కమిషనర్తో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం స్పందన రాకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
