ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా చెన్నై, బెంగళూరు, పూణె నగరాలకు బుల్లెట్ రైల్ కనెక్టివిటీ కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టులో కీలకంగా శంషాబాద్ సమీపంలో భారీ జంక్షన్ (టెర్మినల్) నిర్మించనున్నారు. ఈ హబ్ ద్వారా మూడు కారిడార్ల రాకపోకలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం సుమారు 650 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని రషీద్ గూడ, చిన్న గొల్కోండ, బహుదూర్ గూడ ప్రాంతాల్లో భూసేకరణ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఈ భూమిలో అత్యాధునిక టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నారు.ఈ బుల్లెట్ రైల్ హబ్ను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు మెట్రో రైల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. దీంతో విమానాశ్రయం, మెట్రో, రైలు సేవలు ఒకే నెట్వర్క్లో కలిసేలా ప్రణాళిక సిద్ధమవుతోంది.హైదరాబాద్ మెట్రోను శంషాబాద్ వరకు విస్తరించడంతో పాటు నాగోల్–శంషాబాద్ మార్గంలో కొత్త లైన్, అలాగే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మరో మెట్రో మార్గం ప్రతిపాదనలో ఉంది. ఈ అనుసంధానంతో ప్రయాణికులు మెట్రో నుంచి నేరుగా బుల్లెట్ రైల్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.మొత్తంగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ దేశంలోని కీలక హైస్పీడ్ రైల్ నెట్వర్క్ హబ్గా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
