ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ మరియు లోక్సభ ఎంపీలకు లేఖ రాశారు.ఈ లేఖలో 2029 ఎన్నికల నుంచి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే లక్ష్యంతో తీసుకువస్తున్న ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళల సాధికారత దేశ అభివృద్ధికి కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పాన్ని బలపరచాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ బిల్లు మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడంలో చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ నెల 16న పార్లమెంట్లో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇది దేశ ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు కావడం సమానత్వం, సామాజిక న్యాయం దిశగా పెద్ద అడుగుగా నిలుస్తుందని తెలిపారు.ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు.భారతదేశం మహిళా శక్తిని గౌరవించే దేశంగా నిలవాలని, అందుకే ఈ బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

