ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం తమ ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టిందని ఆయన తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టినట్లు జగన్ వెల్లడించారు. మత్స్యకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నామని చెప్పారు. రామాయపట్నం పోర్టు పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టులో సుమారు 35 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.మచిలీపట్నం పోర్టు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే తీరప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడేందుకు, వారికి ఆధునిక వసతులు అందించేందుకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు.
