ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు కీలక లేఖ రాశారు. ఈ లేఖ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ లేఖలో రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల తరఫున గళమెత్తుతూ, జనాభా ప్రాతిపదికన మాత్రమే లోక్సభ సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను శిక్షించే విధంగా ఈ నిర్ణయం మారకూడదని ఆయన పేర్కొన్నారు.దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించిన రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మహిళా సాధికారతకు ఇది కీలక నిర్ణయమని అభిప్రాయపడ్డారు.అయితే డీలిమిటేషన్లో సీట్ల పెంపు విషయంలో జాగ్రత్త అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మార్చడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ సీట్ల కేటాయింపులో సమతుల్యత ఉండాలని అన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నప్పటికీ, నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గితే ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు.ఈ సమస్యకు పరిష్కారంగా ‘హైబ్రిడ్ మోడల్’ను ప్రతిపాదిస్తూ, సీట్ల కేటాయింపులో జనాభాతో పాటు ఆర్థిక ప్రమాణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
