ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కవిత అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, మైనార్టీ నాయకులకు చాదర్ను అందజేశారు. వారు రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి చాదర్ సమర్పించనున్నట్లు చెప్పారు.తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అజ్మీర్ షరీఫ్లోని ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాను దర్శించి మొక్కు చెల్లించుకుంటానని అప్పట్లో సంకల్పించానని కవిత గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దర్గాను సందర్శించి మొక్కు తీర్చుకున్నానని తెలిపారు.ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి ఎదుగుతున్న నేపథ్యంలో ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులు తీసుకోవడానికి ఈ చాదర్ పంపిస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలకు శాంతి, సుభిక్షం కలగాలని, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నట్లు కవిత తెలిపారు.
