ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని మాండ్య జిల్లా ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 9 ముఖ్యమైన సంకల్పాలను సూచించారు.ఈ సందర్భంగా ప్రతి కుటుంబం తమ తల్లిపేరు మీద ఒక మొక్క నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడాలని సూచించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాలని తెలిపారు.ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలని, ఆరోగ్యానికి హానికరమైన నూనె పదార్థాలను తగ్గించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులు సేంద్రియ పద్ధతులను అవలంబించాలని కోరారు.అలాగే ప్రజలు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, మతపరమైన స్థలాల్లో పరిశుభ్రత పాటించాలని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించాలని కూడా సూచించారు.ఈ 9 సంకల్పాలను ప్రతి పౌరుడు జీవితంలో అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
