ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటి నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణశాఖ అంచనా ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2–3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వడగాల్పుల ప్రభావం కూడా మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ మృతులు పెరుగుతున్నాయి. ఇటీవల ఒక్కరోజులోనే నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ వల్ల మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేస్తోంది. ఈ పరిహారం పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరణం వడదెబ్బ కారణంగానే జరిగిందని నిర్ధారించే పత్రాలు సమర్పించాలి. పోస్ట్మార్టం రిపోర్ట్, పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ, వాతావరణశాఖ ధృవీకరణ పత్రం తప్పనిసరి. మరణం జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ ధృవీకరించాలి. అలాగే మరణ ధృవీకరణ పత్రం, మృతుడి మరియు వారసుల ఆధార్ కాపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, కుటుంబ సభ్యుల డిక్లరేషన్ కూడా సమర్పించాలి.మరణం జరిగిన వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారులు విచారణ జరిపి నివేదికను సిద్ధం చేసి కలెక్టర్కు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాత పరిహారం నామినీ ఖాతాలో జమ అవుతుంది.అలాగే ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం అవసరం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే పరిహారం అందుతుంది. ఈ విషయంపై అవగాహన లేక చాలామంది కుటుంబాలు ప్రభుత్వం అందించే సహాయాన్ని పొందలేకపోతున్నాయి.అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, ఎండల సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే నీడలో ఉండటం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
