ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ నియామకం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లోకేష్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పరిపాలనా సామర్థ్యాలను లోకేష్ వారసత్వంగా అందిపుచ్చుకున్నారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ ఎదిగి, తక్కువ సమయంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారని కొనియాడారు.పార్టీ పట్ల అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధతతో లోకేష్ పనిచేస్తున్న తీరు ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడం, పార్టీ బలోపేతం దిశగా ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యంగా యువతతో సన్నిహితంగా మమేకమవుతూ పార్టీకి కొత్త శక్తిని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రిగా లోకేష్ చేపట్టిన సంస్కరణలను కూడా అచ్చెన్నాయుడు అభినందించారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంపు, మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ విద్యా ప్రోత్సాహం వంటి చర్యలు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయని వివరించారు.ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ చర్యలు రాష్ట్రాన్ని విద్యా రంగంలో ముందంజలో నిలబెడతాయని అభిప్రాయపడ్డారు.లోకేష్ కొత్త బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారని అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
