ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుతో కలిసి జాతీయ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ తన మద్దతును స్పష్టంగా ప్రకటించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం సమాజానికి అవసరమని, ఇది మహిళల సాధికారతకు దోహదపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాత్రం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి దిశగా ముందున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదని స్పష్టం చేశారు. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటాను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేసీఆర్ గట్టిగా చెప్పారు.అలాగే పార్టీ బలోపేతంపై కూడా చర్చ జరిగింది. రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని నాయకత్వం నిర్ణయించింది.
