Breaking News

మత్స్యకారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో రూ.20 వేల ఆర్థిక సాయం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు వేట నిషేధం కొనసాగుతుంది. ఈ సమయంలో మత్స్యకారులు ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ఈ సహాయం అందించనున్నారు.ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మత్స్యశాఖ అధికారులు గ్రామ స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు. పారదర్శకత కోసం ఎంపికైన వారి జాబితాను స్థానిక సచివాలయాల్లో ప్రదర్శించి, తుది జాబితా ఖరారు చేసిన తర్వాత నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.ఈ పథకానికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మత్స్యకారులు అర్హులు. మత్స్యశాఖలో నమోదు చేసిన యాంత్రీకరణ, మోటరైజ్డ్, సంప్రదాయ పడవల్లో పనిచేసే కార్మికులు, యజమానులు ఈ సాయం పొందవచ్చు. గత సంవత్సరం కూడా సుమారు 1.30 లక్షల కుటుంబాలకు ఈ సహాయం అందినట్లు అధికారులు తెలిపారు.దరఖాస్తు చేసుకునే వారు మత్స్యకార గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, బోటు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ పత్రాలను సమర్పించాలి.ఈ నిర్ణయం వల్ల వేలాది మత్స్యకార కుటుంబాలకు వేసవిలో ఆర్థిక భరోసా లభించనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *