ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని చందానగర్లో మహిళా శక్తిని ప్రతిబింబించేలా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నారీ శక్తి వందన్ చట్టం’కు మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ ర్యాలీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం దేశ రాజకీయ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం మహిళల సాధికారతకు బలమైన అడుగుగా అభివర్ణించారు.మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇప్పటివరకు వారికి తగిన ప్రాతినిధ్యం లభించకపోయినా ఈ చట్టంతో ఆ లోటు తీరనుందని ఆయన పేర్కొన్నారు. మహిళలు రాజకీయాల్లో మరింతగా పాల్గొనడం వల్ల విధాన నిర్ణయాల్లో సమతుల్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.ర్యాలీ సందర్భంగా మహిళలు జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఆకర్షణగా నిలిచి మహిళల ఐక్యతను చాటిచెప్పింది.మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతాయని రామచందర్ రావు తెలిపారు. నారీ శక్తి వందన్ చట్టం అమలుతో మహిళలకు రాజకీయ రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
