ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.టీడీపీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిట్బ్యూరోలో టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు స్థానం కల్పించారు. పార్టీ కష్టకాలంలో ఆయన చేసిన సేవలు, చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలు కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు. పార్టీ పట్ల ఆయన చూపిన క్రమశిక్షణ, కృషికి ఇది గుర్తింపుగా నిలిచింది.రాష్ట్ర స్థాయిలో కూడా పలు కీలక నియామకాలు జరిగాయి. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తమ్మినేని సుజాత రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుండగా, బెందాళం అశోక్కు జోనల్ కో-ఆర్డినేటర్ పదవి అప్పగించారు.అదే విధంగా పలు నియోజకవర్గాల నుంచి మరికొందరు నేతలను రాష్ట్ర కార్యవర్గంలో చేర్చడం ద్వారా పార్టీ బలాన్ని పెంచే దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలతో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.పార్టీని గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు నాయకత్వం భావిస్తోంది. కొత్త బాధ్యతలు చేపట్టిన నేతలు పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నారు.
