ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: భారతీయ రైల్వేలు తన చారిత్రాత్మక ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకున్నాయి. దేశంలో రైల్వే సేవలు ప్రారంభమై నేటికి 173 ఏళ్లు పూర్తయ్యాయి. 1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే వరకు తొలి ప్రయాణికుల రైలు నడిచిన రోజు భారత రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.ఆ రోజుల్లో సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే మూడు ఇంజిన్లతో 13 బోగీలలో సుమారు 400 మంది ప్రయాణికులను తీసుకెళ్లిన ఈ తొలి రైలు కేవలం 34 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే ప్రయాణించింది. కానీ అదే ప్రయాణం భారతీయ రైల్వేల విస్తరణకు పునాది వేసింది. కాలక్రమేణా భారతీయ రైల్వేలు విస్తరించి దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు జీవనాధారంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు ప్రజలను కలుపుతూ ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా నిలిచాయి. రోజూ లక్షల సంఖ్యలో రైళ్లు నడుస్తూ కోట్లాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. సరకు రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి.సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, హైస్పీడ్ రైళ్లు, ఆధునిక సదుపాయాలు వంటి మార్పులతో భారతీయ రైల్వేలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి. భవిష్యత్తులో మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలను అందించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది.173 ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం రవాణా చరిత్ర మాత్రమే కాదు.. దేశ అభివృద్ధి, ప్రజల జీవన విధానాల్లో మార్పుకు ప్రతీకగా నిలిచింది.
