ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: స్టాండప్ కామెడీ పేరుతో మెగా కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో కమెడియన్ అనుదీప్ కటికలపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, నటి నిహారిక వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. స్టాండప్ కామెడీ ముసుగులో వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విషయాన్ని సీరియస్గా తీసుకుని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అఖిల భారత చిరంజీవి యువత నేతలు మాట్లాడుతూ, ఇలాంటి దూషణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. మెగా కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ ఘటనతో స్టాండప్ కామెడీ పరిమితులు, వ్యక్తిగత గౌరవం వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది.
