ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.మహిళలకు శాసనసభలు, పార్లమెంట్లో ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తే వారి సమస్యలకు మెరుగైన పరిష్కారాలు దొరుకుతాయని మంత్రి తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు సమాజం నుంచి పూర్తి మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల అభివృద్ధి, సాధికారత దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
